పర్యావరణ ప్రేమికుడు 'గోక రామస్వామి'కి కొండాలక్ష్మణ్ బాపూజీ అవార్డు.
గత ఐదు దశాబ్దాలుగా పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మొక్కలు నాటుతూ సమాజానికి ఆదర్శంగా నిలిచిన ప్రముఖ పర్యావరణ ప్రేమికుడు, నర్సంపేట నివాసి గోక రామస్వామి (72) కు ప్రతిష్టాత్మక 'కొండాలక్ష్మణ్ బాపూజీ అవార్డు' వరించింది. పర్యావరణ పరిరక్షణ కోసం ఆయన చేసిన నిరంతర కృషిని, సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించిన 'నేతన్న టీవీ' యాజమాన్యం ఈ అవార్డును ప్రకటించింది. ఈనెల 6వ తేదీ (ఆదివారం) వరంగల్లో నిర్వహించబోయే ప్రత్యేక కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డును ఘనంగా ప్రధానం చేయనున్నారు.గోక రామస్వామి తన సుదీర్ఘ పర్యావరణ ప్రస్థానంలో దేశవ్యాప్తంగా లక్షలాది మొక్కలు నాటడమే కాకుండా, పర్యావరణంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించారు. ఆయన నిరుపమాన సేవలను గుర్తించిన దేశ అత్యున్నత పెద్దలు, ఇప్పటివరకు ఐదుగురు రాష్ట్రపతులు, ఐదుగురు ప్రధాన మంత్రుల నుండి ప్రశంసలు, ఆశీస్సులు అందుకోవడం విశేషం.నిజాయితీతో, నిరంతర దీక్షతో పర్యావరణానికి పాటుపడుతున్న రామస్వామికి ఈ అవార్డు దక్కడం పట్ల నర్సంపేట నియోజకవర్గ ప్రజలు, పర్యావరణ ప్రేమికులు తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు ఈ గౌరవం దక్కడం నర్సంపేట ప్రాంతానికే గర్వకారణమని స్థానికులు కొనియాడారు.