సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచేయి
భూపాలపల్లి: ఎన్నికలకు ముందు సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకుండా మోసం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి విమర్శించారు. గురువారం భూపాలపల్లి సింగరేణి ఏరియా 1 ఇంక్లైన్ వద్ద నిర్వహించిన గేట్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. అనారోగ్యానికి గురైన కార్మికులకు వైద్యపరమైన మినహాయింపుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలుపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సమరభేరి కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి, బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు, సింగరేణి కార్మికులు పాల్గొన్నారు. సందర్భంగా పలువురు కార్మికులు గండ్ర వెంకట రమణారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.